రవి ప్రకాష్ సర్వేలో టిడిపి కూటమికి 111సీట్లు...!
ఆంధ్రప్రదేశ్లో టివి9 మాజీ సిఇఓ రవిప్రకాష్ నిర్వహించిన సర్వేలో టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని తేలింది. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్సభకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలు వచ్చాయి. ఎన్నికలు మరో 8 రోజుల్లో జరుగనుండగా వచ్చిన ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవిప్రకాష్ నిర్వహించిన ఈ సర్వేలో టిడిపి కూటమికి 111సీట్లు వస్తాయని తన అంచనాలను వెల్లడించారు. అధికార వైకాపాకు 63స్థానాలు, కాంగ్రెస్కు ఒక స్థానం వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రం మొత్తంలో 175 సీట్లు ఉండగా వాటిలో టిడిపి ఒంటరిగా 95 స్థానాలను సాధిస్తుందని, ఆపార్టీ భాగస్వాములైన జనసేన 13, బిజెపి 3 స్థానాలను సాధిస్తాయని ఆ సర్వేలో తేల్చారు. ప్రాంతాల వారీగా చూసుకుంటే రాయలసీమలో వైకాపాకు 29, టిడిపి కూటమికి 22, కాంగ్రెస్కు ఒక స్థానం వస్తుందని తేలింది. అదే విధంగా దక్షిణకోస్తాలో టిడిపి కూటమికి 40 సీట్లు, వైకాపాకు 15 సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. ఇక ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలో టిడిపి కూటమికి 49, వైకాపాకు 19స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో వచ్చిన ఈ సర్వే టిడిపి కూటమికి బాగా కలిసివస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదొక్కటే కాదు..దాదాపు అన్ని నేషనల్ సర్వేలు ఇదే విధంగా టిడిపి కూటమి విజయం సాధిస్తుందని తెలియజేశాయి.ఇది కాకుండా పలు లోకల్ టీవీలు కూడా ఇదే విధమైన సర్వేలను ఇచ్చాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసిన సంస్థ అయితే టిడిపికి 150 సీట్ల దాకా వస్తాయని తన అంచనాలను ప్రకటించింది.